Tuesday, June 2, 2020

పంచారామ క్షేత్రాలు












పంచారామ క్షేత్రాలు-1
ద్రాక్షారామము:
దర్శనం ఉదయం 6:00 నుంచి 12:00 గంటలు తిరిగి సాయంత్రం 3:00 నుంచి రాత్రి 8:00 గంటలు వరకు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ ... క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం . దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది.
పౌరాణిక గాధలు తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుందేది. అది వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామిని ప్రార్ధించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం [అమరావతి] లో, మూడవది క్షిరారామం [పాలకొల్లు] లో, నాలుగవది సోమారామం [గుణుపూడి, భీమవరం] లో , అయిదవది కుమారారామం [సామర్లకోట దగ్గరగల భీమవరం] లో పడ్డయట. పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు.
గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.
ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
రెండు అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి.
అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది.
సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment